Sri Gyaana Saraswathi Temple Basara | Basara Saraswathi Ammavaru | Vyasapuri | Telangana Tourism
"సరస్వతీ శ్రుతిమహతీ మహీయతామ్”
శ్లోకం: శరదిందు సమకారే! పరబ్రహ్మ స్వరూపిణీ!!
వాసర పీఠ నిలయే! సరస్వతి నమోస్తుతే
వేదమాతయైన జ్ఞాన సరస్వతి సాకారముగా పవిత్ర భారతావనిలో ఆంధ్రదేశమున వ్యాసపురిలో దర్శనమిచ్చుచున్నది. ఈ వ్యాసపురినే బాసర (వాసర) గా పిలుచుచున్నాము. సత్యవతీనుడైన బాదరాయణ మహర్షి అనంతములైన వేదములను బుక్ యజుస్సామాధర్వణములుగా విభజించి వేదవ్యాసుడను నామమును పొందినాడు. సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపుడైన వ్యాసుడు సమస్త తీర్థములను సేవించుచూ మానసిక ప్రశాంతత లభింపక గోదావరీ నదీ తీరమున గల సరోవరమును చేరి, సరస్వతీ నిలయమైన సరోవరమున స్నానమాచరించి, దేవి ఆలయమును ప్రవేశించి శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారిని బహువిధముల స్తోత్రము చేసెను. వ్యాసుని స్తుతికి ప్రసన్నురాలైన అమ్మవారు ప్రత్యక్షమై వ్యాసునికి సరస్వతీ సాయుజ్యము ముక్తి లభింపగలవని అనుగ్రహించెను.
వ్యాసుడీ క్షేత్రమును నివసించి తపమాచరించి తరించిన కారణముగా ఈ ప్రాంతము వ్యాసపురిగా ప్రసిద్ధి చెందినది. కాలాంతరమున లీలా వినోదియైన అమ్మవారు అంతర్థానమైనప్పుడు అజ్ఞాన అమిరాతవృతమైన లోకమును ఉద్దరించుటకు సరస్వతీ దేవీ అజ్ఞానుసారముగా గోదావరి నది నుండి మూడు ముష్టి ప్రమాణమలు ఇసుకను తెచ్చి సర్వాంగ సుందరముగా దేవిని తీర్చిదిద్ది ప్రతిష్టించినది కూడా వ్యాసుడే యగుటవలన వ్యాసపురియను సార్థక నామమీ ప్రాంతమును లభించినది.
వేదమాతయైన సరస్వతి, సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపుడైన వేదవ్యాసుడు, పవిత్ర గోదావరి నదీ తీరము - ఈ మూడు విశేషముల వలన ఈ క్షేత్రము వేదనిలయమై శోభిల్లుచున్నది.
No comments